న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. కాగా ఈ తరహ ఉగ్రదాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించారు. దీంతో జమ్ముతో పాటు పలు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో శ్రీనగర్లో అధికారులు ఇంటర్నెట్ సేవలన నిలిపివేశారు. జమ్ములో ఆని ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా బారాముల్లా జిల్లా సోపోర్లో భద్రత బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని నిలువరించారు. దీంతో భద్రతా బలగాలకు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ నెల 16, 17 తేదిల్లో పాకిస్తాన్ లోని జైషే మహ్మద్ నాయకులు, కశ్మీర్ లోయలో ఉన్న ఉగ్రవాదులతో సంభాషించారని, ఆ సంభాషణలో జమ్మూ నగరం లేదా జమ్మూ కశ్మీర్ బయటి ప్రాంతంలో ఒకచోట మన జవాన్లపై భారీ దాడి చేయాలని వ్యూహం పన్నినట్లు ఇంటలిజెన్స్ కు సమాచారం అందింది. దీంతో ఇంటలిజెన్స్ అధికారులు మన భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు.