న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించడంతో దేశమంతా విషాదంలో మునిగితే, ఘటన జరిగిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ప్రచార చిత్రం షూటింగ్లో కొనసాగారని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఉగ్రదాడి ఘటనలో మరణించిన జవాన్ల మృతదేహాలను లెక్కిస్తుండగానే, ప్రధాని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో బోటులో విహరిస్తూ ప్రచార చిత్రానికి బాలీవుడ్ స్టార్లా ఫోజులిచ్చారని మండిపడింది.
పుల్వామాలో చోటు చేసుకున్న ఉగ్రదాడికి సంబంధించిన సమాచారం ప్రధానికి తెలిసినా ప్రచార చిత్రం షూటింగ్లో కొనసాగడాన్ని కాంగ్రెస్ ప్రతినిధి రణ్దీప్ సింగ్ సుర్జీవాలా తప్పుపట్టారు. ప్రధాని మోదీ రాజధర్మాన్ని విస్మరించారని ఆరోపించారు. ప్రధాని బాధ్యతారహితంగా వ్యవహరించారని, ప్రచార చిత్రంలో పాల్గొనడానికి బదులు ఆయన తక్షణమే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో పాల్గొని ఉండాలని పేర్కొన్నారు. అమరవీరులను అవమానపరిచేలా ప్రధాని మోదీ వ్యహరించారని విమర్శించారు.