బంగ్లాదేశ్, ఫిబ్రవరి 22: బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఓ భవంతి కింది అంతస్తులో నిల్వ ఉంచిన రసాయనాలకు మంటలు అంటుకోవడంతో పాటు చుట్టుపక్కల ఉన్న మరో నాలుగు భవనాలకు అగ్నికీలలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 69 మంది ప్రాణాలు కోల్పోగా మరో 50 మంది గాయాల పాలయ్యారు.
ఢాకా నగరంలోని పాత చౌక్ బజార్ లోని నాలుగంతస్తుల హాజీ వహెద్ భవంతి లో బుధవారం రాత్రి 10.40 గంటలకు ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో పక్కనే ఉన్న మిగతా భవంతులకు అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి.
ఈ ప్రమాదం గురించి దక్షిణ ఢాకా మేయర్ సయీద్ ఖొకోన్ మాట్లాడుతూ... అగ్నిప్రమాదం ప్రారంభమైన భవంతి కింది అంతస్తును రసాయనాలు నిల్వచేసే గోదాముగా మార్చారని తెలిపారు. ఇదే భవనంలోని పైఅంతస్తుల్లో ప్రజలు నివాసం ఉంటున్నారన్నారు. ఘటనస్థలికి సమీపంలో ఓ వివాహ వేడుక జరగడం, రెస్టారెంట్లలో జనసందోహం ఉండటంతో మృతుల సంఖ్య పెరిగిందన్నారు.
ఈ దుర్ఘటనలో కొన్ని మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయనీ, వీటికి డీఎన్ఏ పరీక్షలు అవసరమవుతాయని వెల్లడించారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, తొమ్మిది మంది మహిళలు ఉన్నారన్నారు. రాత్రి కావడంతో ఓ భవంతి ప్రధాన ద్వారానికి తాళం వేశారనీ, దీంతో మంటల నుంచి తప్పించుకోలేక పలువురు స్థానికులు చనిపోయారని పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు లక్ష టాకాలు(రూ.84,576), తీవ్రంగా గాయపడ్డవారికి 50,000 టాకాలు (రూ.42,288) పరిహారంగా అందిస్తామని బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఢాకా అగ్నిప్రమాదంపై విచారణ జరిపేందుకు బంగ్లాదేశ్ హోం, పరిశ్రమల శాఖలు వేర్వేరుగా విచారణ కమిటీలను ఏర్పాటు చేశాయి.