దక్షిణ కొరియాలో మోదీకి శాంతి పురస్కారం

SMTV Desk 2019-02-21 19:46:23  

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం దక్షిణ కొరియా చేరుకున్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వం సియోల్ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం పలికింది. ఈ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. దీనివల్ల కొరియాతో భారత్ సంబంధాలు మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ సహకారం, ప్రపంచ అభివృద్ధి, మానవ విలువలను పెంచడంలో చేసిన కృషికి గాను మోదీని దక్షిణకొరియా శాంతి పురస్కారంతో సత్కరిస్తోంది.

ఇండియా-దక్షిణకొరియా బిజినెస్ సింపోజియంలో కాసేపట్లో మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. అనంతరం ఇండియా-దక్షిణకొరియా స్టార్టప్ హబ్ ను లాంచ్ చేస్తారు. భారత్ లో దక్షిణకొరియా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు, ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు మరింత పెరిగేందుకు ఈ స్టార్టప్ హబ్ కీలక పాత్ర పోషించబోతోంది. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక పథకాలకు కొరియా సహకారం తప్పనిసరి కావడంతో.. ఆ దిశగా మోదీ చర్చలు సాగనున్నాయి. పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ దక్షిణ కొరియాతో పలు ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశముంది.