తమిళనాడు, ఆగస్టు 3 : తమిళనాడులోని పెరంబలూరు జిల్లా ముత్తునగర్ కు చెందిన ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో పాఠశాల విద్యార్ధులు తినే ఆహారంలో కుళ్లిన కోడిగుడ్లు వడ్డించారని, సినీనటుడు కమలహాసన్ కు ఆయన అభిమానులు తప్పుడు సమాచారంతో ఆరోపణ చేశారని పెరంబలూరు కలెక్టర్ శాంత అన్నారు. ఈ పాఠశాలలో కుళ్లిన కోడిగుడ్లు పిల్లలకు పెడుతున్నారంటూ కమల్ చేసిన ట్విట్టర్ ఆరోపణలపై ఆమె స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ఈ మేరకు వచ్చిన ఆరోపణలపై ఆమె స్వయంగా పాఠశాలకు వెళ్లి అక్కడి యాజమాన్యంతో విచారించానని తెలిపారు. ఇటీవల వర్షాలు కురియడంతో గుడ్లను నిల్వ చేసిన గదిలో ఆ వర్షపు నీరు చేరడం కారణంగా ఒక ట్రేలోని గుడ్లన్నీ తడిసిపోయాయన్నారు.. వాటిని వెంటనే స్కూల్ యాజమాన్యం బయట పారవేశారని తెలిపారు. అయితే ఆ ఫోటోలనే తీసి కమల్ అభిమానులు తప్పుడు సమాచారాన్ని ఆయనకు వినిపించారని, దీంతో ఆయన అలా స్పందించి ఉంటారని, కమల్ హసన్ లాంటి గొప్ప వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసారు.