నంద్యాల, ఆగష్టు 3: నంద్యాల ఉపఎన్నికల నగారా మోగిన నేపధ్యంలో పార్టీలన్ని కసరత్తులు ముమ్మరం చేశాయి. 2019 ఎన్నికల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పార్టీలు రెండింటికి ఈ ఉపఎన్నికలు కీలకం కానున్నాయి. ఈ నేపధ్యంలో వైసీపీ ఈరోజు నంద్యాలలోని ఎస్పీజీ గ్రౌండ్లో బహిరంగసభ ఏర్పాటు చేసింది. ఈ సభకు వైసిపి అధినేత జగన్ హాజరు అయ్యేందుకు, ఇప్పటికే నంద్యాల చేరుకున్నారు. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ... లెక్కలేనన్ని హామీలను ఇచ్చి, ప్రజలను మోసం చేసిన బాబును ఈ సభలో నిలదీస్తామన్నారు. ఈ ఉపఎన్నికల ద్వారా ముఖ్యమంత్రికి ప్రజలు సమాధానం చెప్తారన్నారు. జగన్ నంద్యాల పర్యటనకు టీడీపీ భయపడి, అడ్డుకోవడానికి టీడీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆయన హెద్దెవ చేశారు. దీనికి నిదర్శనం నంద్యాలలో 11 మంది మంత్రులు, 50 మంది ఎమ్మెల్యేలు మకాం వేయడమే అని ఆయన ఆరోపించారు.