అమరావతి, ఫిబ్రవరి 13: అభివృద్ధి బాటలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ సిటీగా పేరు సంపాదించుకున్న విశాఖ నగరానికి సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించేందుకు సిద్దమైంది ఏపి ప్రభుత్వం. సుమారు 2200 కోట్ల రూపాయల వ్యయంతో విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించనున్న ఈ విమానాశ్రయం పనులకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. చంద్రబాబు ఈరోజు మధ్యాహం ఢిల్లీ వెళ్తున్న సంగతి తెలిసిందే. మరల ఈ రాత్రికి చంద్రబాబు నేరుగా విశాఖ చేరుకొనున్నారు. పోర్టు గెస్ట్హౌస్లో రాత్రికి బసచేసి ఉదయాన్నే హెలికాప్టర్లో భోగాపురం చేరుకుని అక్కడి గ్రీన్ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తారు.
ఏపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తయితే అంతర్జాతీయ భారీ విమానాల రాకపోకలకు మార్గం సుగమం అవుతుంది. అలాగే, విదేశాలకు కూరగాయల ఎగుమతి, దిగుమతులకు సదుపాయం అందుబాటులోకి వస్తుంది. విమానాశ్రయ శంకుస్తపాన అనతరం ముఖ్యమంత్రి కాపులుప్పాడ చేరుకుని అక్కడ ఆదానీ గ్రూప్ ఏర్పాటు చేస్తున్న డేటాసెంటర్కు భూమిపూజ చేస్తారు. తరువాత విశాఖ రూరల్ ప్రాంతంలోని అచ్యుతాపురం చేరుకుంటారు. అక్కడి సెజ్లో ఏషియన్ పెయింట్స్ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమను రిమోట్ కంట్రోల్తో ప్రారంభిస్తారు. అనంతరం తిరిగి అమరావతి పయనమవుతారు.