అమరావతి, ఫిబ్రవరి 13: గత కొన్ని రోజులుగా ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీ విడనున్నట్టు సమాచారం. ఆమంచి 2014 ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి అనూహ్య రీతిలో విజయం సాధించారు. ఆ తరువాత ఆయన టీడీపీలో చేరారన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆమంచి టీడీపీకి రాజీనామా చేశారు. ఈ ఉదయం తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పంపారు. తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన ఆమంచి, నేడు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు మీడియాకు వెల్లడించారు. వైసీపీ అధినేత జగన్ తో ఈరోజు సమావేశం కానున్నానని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమంచిని బుజ్జగించేందుకు ప్రయత్నించిన పలితం లేకపోయింది. ప్రకాశం జిల్లా మంత్రి శిద్ధా రాఘవరావు అసెంబ్లీలో ఆమంచిని కలిసి పార్టీని వీడవద్దని నచ్చజెప్పిన కూడా ఆయన ఒప్పుకోలేదట. ఇదిలా ఉండగా ఈరోజు చంద్రబాబు నాయుడుకు ఆమంచి రాజీనామా లేఖను పంపించగానే అలర్ట్ అయిన ఆయన, కరణం బలరాంకు అప్పగించారు. వెంటనే చీరాల తెలుగుదేశం నేతల సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించడంతో, కరణం బలరాం పరుగుపరుగున చీరాలకు బయలుదేరి వెళ్లారు. సమావేశంలో పాల్గొన్న వారు, ఆమంచితో పాటు నేతలు, కార్యకర్తలు వెళ్లకుండా చూడాలని చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది.