న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: రాబోయే లోక్ సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 300ల స్థానాలను దక్కించుకుంటుందని, మరోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ సింహాసనం అధిష్టించనున్నారని ఆయన సోదరుడు ప్రహ్లాద్ మోదీ జోశ్యం చెప్పారు. ప్రస్తుతం కర్ణాటకలోని మంగళూరు పర్యటనలో ఉన్న ప్రహ్లాద్ మోదీ, మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అలాగే, "2014 ఫలితమే ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ పునరావృతమవుతుంది. బీజేపీకి 300 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి" అని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు అధికారంలో ఉన్న మోదీ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని తెలిపారు. ప్రియాంకా గాంధీ రాజకీయాల్లోకి వచ్చినా కాంగ్రెస్ కు పెద్దగా ఉపయోగం లేదని ప్రహ్లాద్ మోదీ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాల కూటములు గతంలో ఎన్నోసార్లు ఓడిపోయాయని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అన్నారు.