కిర్లంపూడి, ఆగష్టు 3: కాపు రిజర్వేషన్ పోరాట నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్ర వారం రోజుల గృహ నిర్భందం కారణంగా ఈ నెల 3వ తేదీకి ఆయన వాయిదా వేసిన సంగతి విధితమే. ఈ నెల 2తో ఆయన గృహ నిర్భందం ముగిసిన సందర్భంగా నేటి ఉదయం తన అనుచరులు, మద్దతు దారులతో కలసి ఆయన తన నివాసం నుంచి పాదయాత్రకు బయలుదేరారు. కాగా, పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. మరోసారి పోలీసులు ముద్రగడను అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఆయన వారిని ప్రశ్నించగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ 2009ను పోలీసులు చూపించారు. 2014చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్రకు సంబంధించిన అనుమతి పత్రాలు తనకు ఇప్పించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను డిమాండ్ చేయట్లేదు వేడుకుంటున్నానని స్పష్టం చేశారు. అప్పుడు చంద్రబాబుకు అనుమతిని ఇచ్చినవారు, ఇప్పుడు తనకు ఎందుకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. పోలీసులు తన పాదయాత్రను అడ్డుకోవడంతో, ఆయన తిరిగి తన నివాసంలోకి వెళ్లిపోయారు. అయితే, తన యాత్ర నిరవధిక యాత్రని ఎట్టి పరిస్థితుల్లోను వాయిదా వేయబోనని చెప్పారు.