హైదరాబాద్, జూన్1 : హైదరాబాద్ పోలీస్ కమీషనర్ గా, అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా వినూత్న సేవలందించి...అందరితో మమేకమవుతు..విధి నిర్వహాణలో ఎలాంటి సర్దుబాటు సహించని అధికారిగా ఎ కె ఖాన్ అందరికి సుపరిచితులే. పదవి విరమణ చేసిన ఆయనను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేకంగా మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారుగా నియామకం చేశారంటే ఆయన కార్యదీక్ష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. ఆయనకు మరో కీర్తికీరిటం అలంకరించింది. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుకొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొదుర సుమతీ...అనే పద్యం వేమన శతకం లోనిది. సరిగ్గా ఐపిఎస్ అధికారి ఎకె ఖాన్ కు తన కుమారుడి ద్వారా జాతీయ స్థాయిలో ఖ్యాతి లభించింది. ఆయన కుమారుడు ముజామిల్ ఖాన్ సివిల్ సర్వీసెస్ లో జాతీయ స్థాయిలో 22 వ ర్యాంకు సాధించారు. హైదరాబాద్ నగరంలోనే ఇంజనీరింగ్ పూర్తి చేసిన ముజామిల్ గత ఏడాది సివిల్స్ వ్రాసి ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ కు ఎంపికయ్యారు. ప్రస్తుతం 22 వ ర్యాంకుతో ఐఏఎస్ కు ఖరారయ్యే అవకాశం లభించింది.