అగర్తలా, ఫిబ్రవరి 12: మహిళలకు మంచిరోజులు వస్తున్నాయి అని అనుకునేలోపే ఇలాంటి అవమానకరమైన సంఘటన చోటుచేసుకుంది. త్రిపుర మంత్రి ఒకరు తను భాద్యతగల హోదాలో ఉన్న సంగతి మరిచిపోయి సాటి మహిళా మంత్రిపై అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపుతుంది. ఈమధ్య కాలంలో జరిగిన బీజేపీ ర్యాలీలో రాష్ట్ర మంత్రి మనోజ్ కాంతిదేవ్ మరో మంత్రి సంతను చక్మాతో అనుచితంగా ప్రవర్తించారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఒక మహిళా మంత్రితో అసభ్యంగా ప్రవర్తించిన ఆయనను రాజీనామా చేయాలంటూ ఐద్వా(ఆల్ ఇండియా డెమోక్రాటిక్ ఉమెన్స్ అసోసియేషన్) అగర్తలాలో భారీ ర్యాలీ నిర్వహించింది. పట్టపగలు దేశ ప్రధాని పాల్గొన ఇలాంటి సమావేశంలో ఈ తరహాలో వ్యవహరించడం మహిళలను తీవ్రంగా అవమానించడమేనని మహిళా సంఘాల నేతలు మండిపడ్డారు. వెంటనే ఆ మంత్రిని అరెస్ట్ చెయ్యాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా ఈ విషయం పట్ల బీజేపీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.