న్యూడిల్లీ, ఫిబ్రవరి 12: దేశ రాజధానిలో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డిల్లీ కరోల్ భాగ్ లోని అర్పిత్ ప్యాలస్ హోటల్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తెల్లవారు జామున ఈ ఘటన జరగడంతో హోటల్ లో గందరగోళం ఏర్పడింది. దట్టమైన పొగ కమ్ముకోవడంతో అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో జనం పరుగులు తీసారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు పురుషులు ఇద్దరు మహిళలు, ఒక శిశివు ఉన్నారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
హోటల్ సిబ్బంది 25 మందిని రక్షించగా ఇంకా కొంతమంది మంటల్లో చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. కేరళలోని ఒకే కుటుంబానికి చెందిన పదిమంది మంటల్లో చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. వీరిని కాపాడడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉదయం నాలుగు గంటల సమయంలో అందరూ ఘాడ నిద్రలో ఉండగా మంటలు అలుముకున్నాయి. సిబ్బంది అప్రమత్తమయ్యేలోపే క్షణాల్లో మంటలో వ్యాపించాయి. దీంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు, 26 ఫైర్ ఇంజన్లతో మాట్లాలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.