అనంతపురం, ఫిబ్రవరి 11: ఈరోజు అనంతపురంలో జరిగిన సమర శంఖారావం సభలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తక్కువ డబ్బులు ఇస్తే తీసుకోకుండా ఇంకా కావాలని డిమాండ్ చెయ్యాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అవినీతి సొమ్ముతో ఓటర్లను ప్రభావితం చెయ్యాలని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు వెయ్యని డ్రామాలు ఉండవు, చెప్పని అబద్దాలు ఉండవన్నారు. ఆఖరికి అవినీతి సొమ్మును పంచేందుకు కూడా వెనకాడరన్నారు.
ఈ ఐదేళ్లలో లక్షల కోట్లు సంపాదించిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఓటుకు రూ. 3000 ఇవ్వాలని చూస్తున్నారన్నారు. అలా రూ.3000 ఇస్తే చాలవు రూ.5000 కావాలని అడగాలని చెప్పారు. డబ్బులు తీసుకోండి కానీ ఓటు మాత్రం భగవంతుడిని తలచుకుని వెయ్యాలని కోరారు. ఏ భగవంతుడు అవినీతి సొమ్మును తీసుకుని ఓటెయ్యమని చెప్పడన్నారు.