హైదరాబాద్, ఫిబ్రవరి 08: సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా పెట్టిన ఎఎంబి మల్టిప్లెక్స్ వ్యవహారాలు చూస్తూ బిజీ బిజీ అయిపోయాడు. అంతేకాక కొత్తగా ప్రొడక్షన్ హౌస్ పెట్టి సినిమాల నిర్మాణం కూడా మొదలెట్టారు. జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్ బ్యానర్ పెట్టి శ్రీమంతుడు వంటి చిత్రాలకు ఇదివరకే సహ నిర్మాణం చేసారు. అయితే పూర్తి భాధ్యతలను మైత్రీ మూవి మేకర్స్ పై పెట్టారు. కానీ ఇప్పుడు మహేష్ బాబు పూర్తి స్దాయి నిర్మాతగా మారి నిర్మాణం చేపట్టారు.
అందులో భాగంగా మొదట చిత్రాన్ని అడవి శేషు హీరోగా నిర్మిస్తున్నట్లు సమాచారం. గూఢచారి చిత్రం డైరక్ట్ చేసిన శశికిరణ్ తిక్క ఈ సినిమాని దర్శకత్వం చేయబోతున్నారు. మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ ఈ యాక్షన్ థ్రిల్లర్ పూర్తి ప్రొడక్షన్ భాధ్యతలను వహించబోతున్నారు. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ రానుంది.
ప్రస్తుతం మహేష్బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అశ్వనీదత్, దిల్రాజు, పీవీపీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. గురువారం హైదరాబాద్లో డబ్బింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది చిత్ర యూనిట్. రామోజీ ఫిలింసిటీలో ‘మహర్షి’ కోసం ప్రత్యేకంగా ఓ సెట్ను తీర్చిదిద్దారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే కీలక సన్నివేశాల్ని అక్కడే తెరకెక్కించారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.