జానాపూర్, ఫిబ్రవరి 8: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు చేతులు కలపడంపై భాజపా అధ్యక్షుడు అమిత్ షా విమర్శలు గుప్పించారు. యూపీలో పచ్ఛిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కానీ.. ఏపీ సీఎం చంద్రబాబు కానీ లేదంటే ఇంకా ఇతరులు ఎవరైనా కానీ చేసే ప్రచారం కారణంగా ఒరిగేదేమీ లేదని అమిత్ షా పేర్కొన్నారు. ఈరోజు ఆయన జాన్పూర్లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేవెగౌడ లక్నోలో ప్రచారం చేసినా.. చంద్రబాబు మీర్జాపూర్ వచ్చినా.. మమత కాశీ వచ్చినా.. స్టాలిన్ జాన్పూర్లో ప్రచారం చేసిన ఒరిగేదేమీ లేదన్నారు. అయోధ్యలో రామాలయం కట్టడానికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తమ సంకల్పాన్ని ఎవరూ దెబ్బతీయలేరని అమిత్ షా పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణంపై కాంగ్రెస్, సమాజ్వాదీ, బహుజన సమాజ్వాదీ పార్టీల వైఖరేంటో తెలపాలని అన్నారు.