న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: యూపీ మాజీ సీఎం, బీఎస్పి అధినేత్రి మాయావతికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆమె యూపీ సీఎంగా ఉన్న సమయంలో ఏనుగు విగ్రహాల నిర్మాణానికి ఉపయోగించిన ప్రజాధనాన్ని తిరిగి చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. తన పార్టీ ప్రచారం కోసం మాయావతి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారంటూ యూపీకి చెందిన ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ పిటిషన్ విచారణ సందర్భంగా...‘ప్రజా ధనాన్ని ఉపయోగించి మాయవతి తన పార్టీ గుర్తు అయిన ఏనుగు విగ్రహాలను, తన విగ్రహాలను ఆవిష్కరించారు. కనుక రాష్ట్ర ఖజానాలో ఆ సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది’ అని సీజేఐ రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు. కాగా ఏప్రిల్ 2న ఈ కేసు తుది విచారణ జరుగనుంది.