హైదరాబాద్, ఫిబ్రవరి 08: సినీ పరిశ్రమ వాళ్లకి పెద్ద పెద్ద పండగలు ఎలాగో వేసవి కాలం కూడా అలాగే. క్రేజ్ ఉన్న సినిమాలను వేసవి కాలంలో విడుదల చేస్తూ ఉంటారు. వాళ్ళకు సమ్మర్ కూడా ఒక పెద్ద పండగ లాగే భావిస్తూ సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. ఇక ఈ ఏడాది సినిమాలు బాగానే ఉన్నాయి కాని సరైన బజ్ మాత్రం రావడం లేదు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా మహర్షి . వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రిలీజ్ దగ్గర పడే కొద్దీ ఆటోమేటిక్ గా బజ్ వస్తుందని మేకర్లు అనుకుంటున్నారు. కానీ ఏ సినిమాకైనా ప్రమోషన్ అనేది చాలా కీలకం.
ఇక విజయ్ దేవరకొండ టాక్సీవాలా తరువాత నటిస్తోన్న డియర్ కామ్రేడ్ సినిమా మొదట్లో షూటింగ్ చకచకా నిర్వహించారు. షూటింగ్ అయిపోయిందని కూడా అన్నారు. కానీ ఈ సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. గతేడాది దేవదాసు సినిమాతో వచ్చిన నాని జెర్సీ మీద ప్రేక్షకులు ఆసక్తిగానే ఉన్నారు. అయితే ఎమోషనల్ గా సానే ఇలాంటి సినిమాలు జనాలకు ఎంతవరకు నచ్చుతాయనేది చెప్పలేం. పైగా తండ్రీ, కొడుకుల మధ్య ఎమోషన్ అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి!
ఇకపోతే అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్నాడు. తన పెళ్లి తరువాత నాగచైతన్య, సమంత మొదటిసారి కలిసి నటిస్తోన్న సినిమా మజిలీ. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి సరైన ప్రమోషన్ లేక సినిమా డల్ గా కనిపిస్తోంది. పెళ్లైన తరువాత సమంత, చైతు నటిస్తోన్న సినిమా కాబట్టి ఆ ఫ్యాక్టర్ అయినా సినిమాపై బజ్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి!
పడి పడి లేచే మనసు సినిమాతో వచ్చిన శర్వానంద్ కు ఆ సినిమా అనుకున్నంత హిట్ కాలేదు. ప్రస్తుతం శర్వా దోచేయ్, స్వామి రారా, కేశవ వంటి విభిన్న చిత్రాలు తీసిన సుదీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా చాలా కాలంగా సెట్ మీదే ఉంది. ఇంకా టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదు. పైగా ఈ ఇద్దరి లిస్ట్ లో ఈ మధ్య ఒక్క హిట్టు కూడా పడలేదు. దీన్ని బట్టి చూస్తె ఈ ఏడాది సమ్మర్ కి సినిమాల ప్రభావం పెద్దగా లేదు అనిపోస్తోంది.