హైదరాబాద్, ఫిబ్రవరి 08: మెగా తనయుడు రామ్ చరణ్ సినిమా వినయ విధేయ రామ ఈ మధ్యే వచ్చి ఊహించని డిజాస్టర్ గా నిలిచింది. బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పోయిన సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ కు గతంలో చాలానే ఫ్లాప్ లు ఉన్నాయి. కాని ఎప్పుడూ లేని విధంగా రామ్ చరణ్ తన సినిమా ఫ్లాప్ అవ్వడంతో అభిమానులకు తన అధికార పేస్ బుక్ ద్వారా ఓ లెటర్ రాసాడు. అందులో ఆ సినిమాకు పని చేసిన అందరి గురించి ప్రస్తావించాడు కాని బోయపాటి గురించి మాత్రం ఏం చెప్పలేదు. నిర్మాత దానయ్య ను కూడా కలిపి అందరికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇది చూసిన బోయపాటి... చరణ్ నిర్మాతతో కలిసి తనను టార్గెట్ చేసినట్లుగా ఫీల్ అవుతున్నారని వినపడుతోంది. దాంతో ఆయన ఫైట్ చేయటానికి సిద్దపడి లెక్కలు చూపించమన్నట్లుగా అడిగారని తెలుస్తుంది.
అయితే ఈ వివాదం రామ్ చరణ్ డిస్ట్రిబ్యూటర్స్ కు వచ్చిన నష్టాలును ఎంతో కొంత భరిద్దామని ప్రపొజల్ పెట్టడంతో స్టార్ట్ అయ్యింది. ఆ గొడవ ఇప్పుడు పెద్దదై నిర్మాత దానయ్య ను ఎక్కౌంట్స్ బుక్స్ చూపించి లెక్కలు చెప్పమనేదాకా వెళ్లిందని తెలుస్తోంది. సినిమాకు పెట్టిన ఖర్చు, బిజినెస్ డీల్స్, ఎంత వెనక్కి వచ్చింది, సాటిలైట్, డిజిటల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ , ఆడియో రైట్స్ ద్వారా ఎంతంత రికవరీ అయ్యిందో చెప్తే తను ఎంత వెనక్కి ఇవ్వాలనేది నిర్ణయించుకుంటానని బోయపాటి చెప్పినట్లు సమాచారం. బోయపాటి దృష్టిలో రామ్ చరణ్, దానయ్య ఈ సినిమాతో మంచి లాభాలు సంపాదించారని భావిస్తున్నట్లు తెలుస్తోంది.