న్యూ ఢిల్లీ, ఆగస్టు 2 : లౌకిక దేశమైన భారత్ ను హిందూ దేశంగా మార్చుకునేందుకు భారత ప్రధాని మోదీ కుట్ర పన్నుతున్నారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ నేత వి. హనుమంతరావు ఆరోపించారు. దేశంలో విపక్షమే లేకుండా చేసేందుకు ఆయన చేస్తున్నారని, ఇందులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా భాగస్వామిగా ఉన్నట్లు తెలిపారు. మోదీకి వ్యతిరేకంగా మిగిలిన అన్ని పార్టీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైనదని ఆయన అన్నారు. ఈ మేరకు దేశం మొత్తం తిరిగి మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. అయితే, దీనికి సంబంధించి మొదట తెలంగాణలోనే సభ పెడతామని, ఈ సభకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను ఆహ్వానిస్తామని అన్నారు. తెలంగాణ ఇన్ ఛార్జ్ గా వస్తున్న కుంతియా సమర్థుడా? కాదా? అనే విషయం ఆరు నెలల్లో తేలిపోతుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తామని వెల్లడించారు.