అమరావతి, ఫిబ్రవరి 08: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మంగళగిరిలో నిర్మించిన ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(ఏపీఐఐసీ) భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ 11 అంతస్తుల భవనం 2.26 ఎకరాల విస్తీర్ణంలో రూ. 110 కోట్లతో నిర్మించారు.
ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు. పారిశ్రామిక, పెట్టుబడుల విభాగాల కార్యాలయాలన్నీ ఒకే భవనంలో ఏర్పాటు చేశారు. భవనంలోని రెండు సెల్లార్లు పార్కింగ్ కోసం కేటాయించారు. పై మూడు అంతస్తులను ఏపీఐఐసీకి, మిగతా తొమ్మిది అంతస్తులను పరిశ్రమలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు, మరికొన్నింటిని ఐటీ సంస్థలకు అద్దెకు ఇవ్వనున్నారు.
ఈ నేపథ్యంలో మంగళగిరిలో ఐటీకి ప్రోత్సాహం లభించనుంది. అత్యంత ఎత్తైన ఈ బహుళ అంతస్తుల టవర్ మంగళగిరికే ప్రత్యేక ఆకర్షణ కానుంది. కార్యాలయాలన్నీ ఒకే చోట కేంద్రకృతం కావడంతో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఒకే చోట మొత్తం సమాచారం లభించనుంది.