అమరావతి, ఫిబ్రవరి 08: ప్రధాని మోదీ ఆంధ్ర ప్రదేశ్ పర్యటన మరోసారి వాయిదా పడింది. ఫిబ్రవరి 10, 16 తేదిల్లో ప్రధాని ఆంధ్రప్రదేశ్, విశాఖలో పర్యటించాల్సి ఉండగా అదేరోజు కొన్ని ఇతర కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉండడం వలన ఏపి పర్యటనను బీజేపి నేతలు వాయిదా వేసారు. ఈ విషయాన్నీ బీజేపి జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలకు తెలియజేసింది.
అలాగే ప్రధాని ఆంధ్రప్రదేశ్ పర్యటన 27కి వాయిదా వేసినట్లు కూడా తెలిపారు. గురువారం బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్రాజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ప్రధాని సభకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానాన్ని కేటాయించాలంటూ కోరారు. ముందు జాగ్రత్తగా నగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, పోర్టు స్టేడియంలను కూడా బీజేపీ నాయకులు పరిశీలించి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది.
ప్రధాని మోదీతో పాటు అమిత్ షా సైతం ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. ఏపిలో అమిత్ షా పర్యటన మూడు విడతలుగా ఉండగా, ఇప్పటికే ఆయన ఉత్తరాంధ్రలో పర్యటించారు. సత్యమేవ జయతే పేరుతో ఏపీలో బీజేపీ చేపట్టిన బస్సు యాత్ర నాలుగు రోజుల క్రితమే ప్రారంభమైంది. ఈ యాత్ర ఫిబ్రవరి 10కి గుంటూరుకు చేరనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అక్కడ పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు నేరుగా మోదీ ఢిల్లీ నుంచి గుంటూరు చేరుకుంటారు.