హైదరాబాద్, ఫిబ్రవరి 7: హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీ కుమార్ ఓ ప్రముఖ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసు తెలంగాణకు బదిలీ అయ్యిందని వెల్లడించారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా ఎస్పీ నుంచి కేసు డైరీ తమకు చేరిందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు న్యాయం చెయ్యలేదని.. కనుక తెలంగాణ ప్రభుత్వం నుంచి న్యాయం ఆశిస్తున్నానంటూ జయరాం సతీమణి పద్మశ్రీ వ్యాఖ్యానించారు. దాంతో జయరాం హత్యకేసు తెలంగాణకు బదిలీ అయ్యింది.
అయితే తెలంగాణ ప్రభుత్వంపై, ఇక్కడి అధికారులపై పద్మశ్రీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. పద్మశ్రీ ఫిర్యాదు ఆధారంగా ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి కేసు నమోదు చేస్తామన్నారు. ఈ కేసు దర్యాప్తును బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ను అప్పగించామని చెప్పారు. జయరాం హత్య కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న ఇద్దరు నిందితులను కూడా విచారిస్తామని సీపీ వెల్లడించారు.