అమరావతి, ఫిబ్రవరి 7: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఏపీ ప్రతిపక్ష నేత జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లపై తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు ఆయన ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతూ, కేసీఆర్ ప్రయత్నిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ఓ బూటకమని, ప్రధాని మోదీ కోసం కేసీఆర్, జగన్ కలిసి కపట నాటకం ఆడుతున్నారని విమర్శించారు. కాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీని ఇప్పటి వరకు కేసీఆర్ రెండు సార్లు కలిశారని, ఆయన సీఎం కాకముందు, సీఎం అయిన తర్వాత కలిశారని అన్నారు. ఆమెపై సీబీఐ తీరును దేశమంతా ఖండిస్తున్నా,కేసీఆర్, జగన్ మాత్రం ఖండించలేదని అన్నారు. ఇక వారు ఎంత గొప్పనాయకులు? అని ప్రశ్నించారు.
కాగా పిల్లి పాలు తాగుతూ.. తనను ఎవరూ చూడలేదనుకుంటుంది, అలాగే వీళ్లిద్దరి కపట నాటకాన్ని ఎవరు చూడలేదనుకుంటున్నారు.. కానీ దేశమంతా చూస్తోందని అన్నారు. ముగ్గురు మోదీలు కలిసి మోదీ ఫ్రంట్ ఏర్పాటు చేసి, ఈరోజున దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించే పరిస్థితికి వచ్చారని దుయ్యబట్టారు.