తిరువనంతపురం, ఫిబ్రవరి 07: కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని నిర్వహించే సంస్థ ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు(టిడిబి). తాజాగా టిడిబి తన వైఖరిని మర్చుకుంది. ఇప్పటి వరకు దేవాలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించిన టిడిబి ఇప్పుడు అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి ప్రవేశించవచ్చునని సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
అన్ని వయసుల మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించవచ్చంటూ 2018, సెప్టెంబర్ 28న దీపక్ మిశ్ర నేతృత్వంలొని దర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై మొత్తం 65 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూమల్హోత్రాలతో కూడిన ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం బుధవారం వాటన్నిటిపై విచారిస్తున్నప్పుడు టిడిబి తన వైఖరిలో మార్పు గురించి ధర్మాసనానికి తెలియజేసింది. టిడిబి అనూహ్యమార్పుకు ధర్మాసనం సభ్యులు కూడా ఆశ్చర్యనికి గురయ్యారు.
టిడిబి సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి అన్ని వయసుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలని నిర్ణయించిందని, తమపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు లేవని టిడిబి తరపు న్యాయవాది రాకేశ్ ద్వివేది సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అన్ని వయసుల మహిళలు ఆలయ ప్రవేశానికి టిడిబి అంగీకరించినందున, సుప్రీం తీర్పుపై దాఖలైన అన్ని రివ్యూ పిటిషన్లను కొట్టివేయాలని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కోరింది. అందరి వాదనలు విన్న సుప్రీంకోర్టు అనంతరం తన తీర్పును రిజర్వ్ చేసింది.