అమరావతి, ఫిబ్రవరి 07: ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ప్రచారాల జోరు కొనసాగుతుంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు జనసేన పార్టీలో చేరారు. బుధవారం ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ, పోలవరం నిర్వాసితుల కోసం పుల్లారావు ఎంతో పోరాడారని ప్రశంసించారు. గిరిజనులకు అండగా నిలబడ్డారని కొనియాడారు. అమెరికాలో చదువుకున్న ఆయన అనుభవం పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జనసేనలో చేరిన పుల్లారావును పవన్ వెంటనే ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈ నేపథ్యంలో పుల్లారావు మాట్లాడుతూ, ప్రజల కోసం శ్రమిస్తున్న పవన్ బాటలోనే తాను కూడా నడుస్తానన్నారు. మార్పు కోసం పనిచేస్తున్న పవన్తో కలిసి పనిచేసేందుకు అందరూ కలిసి రావాలని కోరారు. పవన్ తనను పార్టీలోకి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ను గెలిపించడానికే పార్టీలో చేరనన్నారు. జనసేన లాంటి పార్టీల అవసరం ఈ దేశానికి ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు.