జనసేనలో కమిటీల ఏర్పాటు..

SMTV Desk 2019-02-06 18:59:47  Pavan kalyan, Janasena, AP, puli sekhar

హైదరాబాద్, ఫిబ్రవరి 06: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీ కమిటీల ఏర్పాటు చేపట్టింది. కాగా పార్టీలోని కమిటీల నియామకంలో భాగంగా సెంట్రల్ కమిటీ ఫర్ అఫైర్స్ (సీసీపీఏ) చైర్మన్ గా పులి శేఖర్ ని నియమించారు. ఈరోజు హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రవాసాంధ్రుడైన పులి శేఖర్ అమెరికాలో వందల కోట్ల విలువైన వ్యాపారాన్ని వదులుకొని పార్టీ కోసం పని చేసేందుకు నిబద్ధతతో వచ్చారని ప్రశంసించారు. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన పులి శేఖర్ లో సామాజిక స్పృహ, పాలనలో పాదర్శకత ఉండాలన్న తపన మెండుగా ఉన్నాయని కొనియాడారు.

తరువాత, పులి శేఖర్ మాట్లాడుతూ.. సిద్ధాంత బలంతో నిర్మితమైన పార్టీ ‘జనసేన’ అని, పవన్ కల్యాణ్ ఆలోచన విధానం, ఆయన భావజాలం తననెంతో ఆకర్షించాయన్నారు. ఈ రాష్ట్రం పవన్ కళ్యాణ్ నాయకత్వం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోందన్నారు. ఇక తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని అన్నారు.