తిరుపతి, ఫిబ్రవరి 06: ఈరోజు తిరుపతిలో నిర్వహించిన వైసీపీ ‘సమర శంఖారావం’లో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సమర శంఖారావంకు హాజరైన వారిని చూస్తుంటే.. కౌరవ సామ్రాజ్యాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్న పాండవ సైన్యంలా ఉందని వర్ణించారు. కాగా త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయని, బూత్ కమిటీలకు దిశా నిర్దేశం చేసేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. తొమ్మిదేళ్లుగా ఎన్నో కష్టాలు పడి తన వెంట నడిచారని, చంద్రబాబు పాలనలో పడరాని పాట్లు పడ్డారని అన్నారు. మీకు తగిలిన ప్రతిగాయం నా గుండెకు తగిలినట్టే. మీ అందరి బాగోగులు నేను చూసుకుంటా. మిమ్మల్ని రాజకీయంగా, సామాజికంగా ఆదుకుంటా. చాలా గర్వంగా చెబుతున్నా, మీరందరూ నా కుటుంబసభ్యులు’ అని అన్నారు.
పాదయాత్ర 3648 కిలోమీటర్ల చేసినప్పుడు ప్రజలు పడే బాధలు కళ్ళారా చూశానని, గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని అన్నారు. కాగా దేవుడు ఆశీర్వదించి, ప్రజల చల్లని దీవెనలతో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని సంక్షేమ పథకాలు అందేలా చేస్తామని అన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి రావాలంటే మీరందరూ బాధ్యత తీసుకోవాలని, మన ప్రభుత్వం రావడం కోసం మీరందరూ సవ్యసాచులై పనిచేయాలని ఆయన పిలుపు నిచ్చారు.