ఏపీకి ఎదురు దెబ్బ..

SMTV Desk 2019-02-06 15:23:45  Chandrababu, AP Government, BJP, galla jayadev, vijayasai reddy, central government, budget

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కేంద్రం ప్రభుత్వం మరో భారీ షాక్ ఇచ్చింది. ఏపీకి అదనపు రుణాలు పొందే అర్హత లేదని తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్ 2018-19 ఏడాదిలో 14వ ఆర్థిక సంఘం నిర్దేశితాల ప్రకారం షరతులను పూర్తి చేయలేదని.. అందువల్ల అదనపు రుణాలు పొందేందుకు ఏపీ అరహత లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఈ విషయం వెల్లడించారు.

కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటికీ 14వ ఆర్థిక సంఘం... జీఎస్డీపీలో మూడు శాతం మేరకు ఆర్థికలోటుకు పరిమితి విధించిందని కేంద్రం పేర్కొంది. అయితే రుణ జీఎస్డీపీ నిష్పత్తి 25శాతం దాటకుండా, వడ్డీ చెల్లింపులు - ఆదాయ వసూళ్ల నిష్పత్తి 10శాతం మించకుండా ఉంటే ఈ ఆర్థికలోటు పరిమితిలో సడలించవచ్చని ఆర్థిక సంఘం సిఫారసు చేసిందని తెలిపారు. అయితే తెలంగాణకు మాత్రమే రూ.2052 కోట్ల మేరకు అదనపు రుణాలు తీసుకొనే అర్హత లభించిందన్నారు. 2018-19లో జీఎస్డీపీలో 0.25 శాతానికి సమానంగా ఈ మొత్తం ఉంటుందని ఆయన చెప్పారు. కాగా.. ఎఫ్ఆర్బీఎం పరిమితిని 0.5శాతం పెంచాలని ఏపీ ప్రభుత్వం కోరిందని.. కానీ షరతులు పూర్తి చేయనందున రాష్ట్రానికి అర్హత లేదన్నారు. ఇక వెనుకబడిన జిల్లాల నిధులపై ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రశ్నించగా.. రూ.350 కోట్లు విడుదల చేసి, ప్రక్రియలో లోపాల వల్ల తిరిగి వెనక్కి తీసుకున్నామని హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారామ్‌ తెలిపారు.