తిరువనంతపురం, ఫిబ్రవరి 06: కేరళలో ఈసారి జరిగే ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కి చెందిన నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లోనే కాదు, సమీప భవిష్యత్ లో కూడా కేరళలో బీజేపీ అధికారంలోకి రాదని చెప్పారు. కేరళ అసెంబ్లీలో ఏకైక బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
నిరుద్యోగంపై కేరళలోని అసెంబ్లీలో చర్చ సందర్బంగా రాజగోపాల్ మాట్లాడుతూ, కేరళను బీజేపీ పాలించడం లేదు. ఈ రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడూ అధికారంలో లేదు. సమీప భవష్యత్తులో కేరళలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. మన రాష్ట్రంలో జాతీయ సగటు కంటే నిరుద్యోగిత చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఉపాధి కోసం యువతీయువకులు వలస వెళుతున్నారు. ఇది వాస్తవం అని తెలిపారు. ఈ సందర్భంగా మీడియా కేరళ బీజేపీ చీఫ్ శ్రీధరణ్ పిళ్లైను సంప్రదించగా, ఈ విషయం పట్ల తమకు ఎలాంటి సమాచారం లేదని తప్పించుకున్నారు. 2015 గణాంకాల ప్రకారం దేశంలో సగటు నిరుద్యోగిత 5 శాతం కాగా, కేరళలో 12 శాతంగా నమోదయింది.