చెన్నై, ఫిబ్రవరి 06: దేశంలో నిరుద్యోగ సమస్య కొత్తది కాదు, బ్యాంకింగ్ సర్వీసు రిక్రూట్మెంట్ బోర్డులు, రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్లు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు, యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇలాంటి వ్యవధిలో ఎన్ని రిక్రూట్మెంట్లు ప్రవేశాపెట్టిన, లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తున్నా కూడా దేశంలో రోజురోజుకూ నిరుద్యోగం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ తీరు ఎలా ఉందొ తెలిపే పరిణామమే తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. తమిళనాడు అసెంబ్లీ సెక్రటేరియట్లో 14 స్వీపర్లు, శానిటరీ వర్కర్ల నియామకానికి ఉద్యోగ ప్రకటన వెలువడింది. దీని కొరకు ఎంటెక్, బీటెక్, ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యూయేషన్, డిప్లొమా చదివిన పట్టభద్రులు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ ఉద్యోగాలకు అర్హత 18 ఏండ్ల వయస్సు నిండి మంచి శరీర సౌష్టవం కలిగి ఉంటే సరిపోతుంది. ఎలాంటి విద్యార్హత లేకున్నా సరిపోతుంది. ఈ ఉద్యోగ పోస్టులకు మొత్తం 4,607 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 3,930 మంది అభ్యర్ధులకు ఇంటర్వూ కోరకు కాల్ లెటర్లను పంపించారు. 14 పోస్టుల్లో 10 స్వీపర్ పోస్టులు, 4 శానిటరీ వర్కర్ పోస్టులు ఉండగా, ఎంపికైన అభ్యర్థులకు నెల వేతనం రూ.15, 700 నుంచి రూ.50,000 వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. గతంలో ఉత్తరప్రదేశ్ 62 ప్యూన్ పోస్టుల కోసం 93వేల మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ముంబయిలో కూడా 13 వెయిటర్ పోస్టులకు 7వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో రోజురోజుకూ నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రమవుతుందో స్పష్టంగా అర్ధమవుతుంది.