హైదరాబాద్, ఫిబ్రవరి 06: అక్కినేని వారసుడు అఖిల్ కి సినీ పరిశ్రమలో ఇంకా సమయం కలిసి రాలేదు. మొదటి సినిమా 'అఖిల్' తో కెరీర్ ప్రారంభించిన అఖిల్ కు పరాజయం ఎదురైంది. అయినా నిరాశ పడకుండా తన రెండో సినిమా 'హలో'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. తర్వాత కొంత సమయం తీసుకొని చేసిన 'మిస్టర్ మజ్ను' కూడా అఖిల్ కు నిరాశే మిగిల్చింది. సక్సెస్ లేకపోయినా అఖిల్ కూల్ గా ఉంటూ తన తర్వాతి సినిమా కోసం ప్లానింగ్ మొదలు పెట్టాడు. అఖిల్, శ్రీనువైట్ల దర్శకత్వంలోనూ, క్రిష్ డైరక్షన్లోనూ సినిమా చేయనున్నాడని వార్తలు వినిపించాయి. కానీ అఖిల్ వీరందరినీ పక్కన పెట్టి తన తర్వాత సినిమా కోసం ప్రభాస్ తో కలిసి పని చేయడానికి నిర్ణయించుకున్నాడు. ప్రభాస్ అంటే హీరో ప్రభాస్ అనుకుంటే అది మన పొరపాటే. అఖిల్ దర్శకుడు సత్య ప్రభాస్ పినిశెట్టితో తన తర్వాత సినిమా ప్లాన్ చేసుకున్నాడు. గతంలో 'మలుపు' సినిమాకు సత్య ప్రభాస్ పినిశెట్టి దర్శకత్వం వహించాడు. 'మిస్టర్ మజ్ను' సినిమా పూర్తికాకముందే అఖిల్ ఈ స్క్రిప్ట్ ను అంగీకరించాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.