చెన్నై, ఆగస్టు 2 : తమిళనాడు అధికార అన్నాడీఎంకేలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీలో ముఖ్యమంత్రి పళనిస్వామి మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గాలు ఏకం కావడం అనంతరం ఆ పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గత నాలుగు నెలలుగా అన్నాడీఎంకే రెండు వర్గాల మధ్య విలీన చర్చలు సాగుతున్నా అవి ఫలప్రదం కాలేదు. ఇటీవలి కాలంలో ఢిల్లీలో ఇరువర్గాల నేతలు, పలు మార్లు ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. విభేదాలు మరచి కలిసి కట్టుగా ఉండాలన్న సూచనలు మేరకు మరోసారి విలీన చర్చలు జరపాలని రెండు వర్గాలు నిర్ణయించాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల లోపు ఎన్డీఏని మరింత పటిష్ట పరచాలన్నా భాజపా, అందులో భాగంగానే బీహార్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా తమిళనాడు వైపు దృష్టి సారించింది. త్వరలోనే విలీనం జరుగుతున్నదంటూ తమిళనాడు ఆర్థిక మంత్రి జైకుమారు తెలిపిన నేపథ్యంలో అటువంటి అవకాశాలు లేవని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ మేనల్లుడు దినకరణ్ అంటున్నారు.