చెన్నై, ఫిబ్రవరి 05: తమిళ సంచలన నటుడు విజయ్ సేతుపతి ఇప్పటివరకు ఎటువంటి వివాదాల జోలికి పోకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న హీరో. ఈయనకి కోలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. అయితే ఈ హీరో తాజాగా చేసిన కొన్ని కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో విజయ్ సేతుపతిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. శబరిమలలో మహిళలకు ప్రవేశం కల్పించడంపై కొన్ని నెలల కిందట సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుని మెజారిటీ ప్రజలు వ్యతిరేకించారు. దీంతో నిరసనలు మొదలయ్యాయి.
అయితే జనాలను అభిప్రాయాలు పట్టించుకోకుండా కోర్టు తీర్పుని ఫాలో అవుతూ కేరళ ముఖ్యమంత్రి పినరపి విజయన్.. మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లడానికి పోలీసు భద్రత కల్పించారు. దీంతో ప్రజల నుండి మరింత వ్యతిరేకత వచ్చింది. తాజాగా తన సినిమా షూటింగ్ కోసం కేరళకు వెళ్లిన విజయ్ సేతుపతి అక్కడ మీడియాతో మాట్లాడుతూ శబరిమల విషయంలో ముఖ్యమంత్రి విజయన్ ని పొగిడాడు. తాను విజయన్ కి అభిమానిని అని చెప్పారు. దీంతో కేరళతో పాటు సొంత రాష్ట్రమైన తమిళనాడులో కూడా విజయ్ వ్యాఖ్యలపై వివాదం రేగుతోంది.