లక్నో, ఫిబ్రవరి 05: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ ర్యాలీని అడ్డుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ఈ సందర్బంగా యోగి ఆదిత్యానాథ్ ర్యాలీని అడ్డుకుంటే బెంగాల్ బంద్కు పిలుపిస్తామని బీజేపీ హెచ్చరించింది. పురూలియా ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించేందుకు వస్తున్నా యోగి హెలికాఫ్టర్ ల్యాండయ్యేందుకు బెంగాల్ అధికారులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఇందువల్ల మంగళవారం లక్నో నుంచి జార్ఖండ్లోని బొకారోకు చాపర్లో చేరుకున్న యోగి అక్కడి నుంచి ర్యాలీకి వేదికైన పురూలియాకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు.
బీజేపీ నేత విశ్వప్రియ రాయ్ చౌధరి పురూలియాలో యోగి ర్యాలీని అడ్డుకుంటే బెంగాల్ బంద్ చేపడతామని హెచ్చరించారు. మరోవైపు ముర్షిదాబాద్లో బీజేపీ ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ ర్యాలీకి అధికారులు అనుమతి నిరాకరించారు. గతంలో బీజేపీ చీఫ్ అమిత్ షా ర్యాలీలకూ బెంగాల్ అధికారులు అడ్డంకులు సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా యూపీలో పరిస్థితిని చక్కదిద్దుకోలేని యోగి బెంగాల్ చుట్టూ తిరుగుతున్నారని సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు.