పీఎం- కిసాన్ పథకం

SMTV Desk 2019-02-05 15:49:19  PM-Kisan Samman Nidi

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 05: ఈమధ్యనే జరిగిన కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం- కిసాన్) పథకం గురించి తెలిసిందే. ఈ పథకం కింద ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6000 ఇవ్వనున్నారు. ఈ పతాకాన్ని 2018 డిసెంబర్ 1 నుండి వర్తింపజేయనున్నారు. ఈ పథకానికి ఈ ఏడాది ఫిబ్రవరి 1 నాటికి ఉన్న భూమీ దస్త్రాలనే కేంద్రం పరిగణనలోకి తీసుకోనుంది. అర్హులైన రైతుల గుర్తింపునకు సంబంధించి రైతు కుటుంబాన్ని యూనిట్ గా తీసుకోనుంది.

ఈ పథకానికి సంబంధించిన వివరాలు:

- ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6000 మొత్తాన్ని 3 విడతలుగా అందిస్తారు. నాలుగు నెలలకోసారి రూ.2 వేల చొప్పున అందజేస్తారు. 1.12.2018 నుంచి 31.3.2019 కాలానికి ఒక విడత మొత్తాన్ని మార్చి నెలాఖరు నాటికి రూ.2 వేలు ఇస్తారు.

- రైతు కుటుంబం యూనిట్ గా అంటే.. భర్త, భార్య, ఇద్దరు పిల్లలు (18 ఏళ్ల లోపు). వీళ్లందరికీ కలిపి 5 ఎకరాల లోపు సొంత సాగుభూమి ఉండాలి.

- ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపికకు రాష్ట్రాల్లో ఉండే భూ దస్త్రాల నమోదు విధానమే ప్రాతిపదిక

- 2019 ఫిబ్రవరిలోగా భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన పత్రాలు ఆల్ లైన్ లో నమోదై ఉన్న వారినే అర్హులుగా గుర్తిస్తారు.

- ఒక రైతు కుటుంబానికి వివిధ గ్రామాలు/ రెవెన్యూ గ్రామాల్లో ఉన్నవన్నీ పరిగణనలోకి తీసుకుంటారు.

- ఫిబ్రవరి తర్వాత కొత్తగా భూమి యాజమాన్య హక్కులు వచ్చే వాటిని ఐదేళ్ల దాకా పరిగణనలోకి తీసుకోరు. అప్పటికే పథకం వర్తించే ఖాతాలకు సంబంధించిన భూముల యాజమాన్య హక్కులను వారసులకు బదిలీ చేస్తే ప్రయోజనం వర్తింపజేస్తారు.

- కొన్ని రాష్ట్రాల్లో కౌలు రైతులు ఈ పథకం ప్రయోజనాలకు దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఆయా రాష్ట్రాలు కేంద్రం అమలు చేస్తున్న నమూనా కౌలుదారుచట్టాన్ని అనుసరిస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.