అమరావతి, ఫిబ్రవరి 5: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ అంచనా మొత్తం 2.26 లక్షల కోట్లు. సభ మొదలైన వెంటనే ప్రభుత్వం కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు.
ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పటికీ.. ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదన లేదని తెలుస్తుంది. అయితే గతేడాది కంటే వ్యవసాయ రంగ కేటాయింపులు భారీగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏపీ బడ్జెట్ లో సాగునీటి, వ్యవసాయ రంగాలకు కేటాయింపులు అధికంగా ఉండవచ్చని తెలుస్తోంది. రాజధాని అమరావతిని నిర్మాణానికి పెద్దపీట వేసారు. దాంతోపాటు నిరుద్యోగులు, రైతులు, మహిళలు, పేదలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ఈరోజు ఉదయం 11.45 గంటలకు యనమల రామకృష్ణుడు అసెంబ్లీ సమవేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థికశాఖ అధికారులు పూర్తిస్థాయిలో 2019-20 సంవత్సరానికి ప్రతిపాదనలు సిద్ధం చేసారు.