న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక్కరే కాస్త ధైర్యమున్న నేతని అన్నారు. రాహుల్ గాంధీ రఫేల్ కుంభకోణంతో పాటు, రైతుల దుస్ధితి, వ్యవస్ధల నిర్వీర్యంపై తమ ప్రశ్నలకు బదులివ్వాలని గడ్కరీని కోరారు. గడ్కరీజీ..బీజేపీలో కాస్త ధైర్యం ఉన్న నాయకులు మీరే అయినందుకు ధన్యవాదాలు..మోదీ సర్కార్లో ముందుకొచ్చిన రఫేల్ స్కామ్, రైతుల దుస్ధితి, వ్యవస్థలను నిర్వీర్యం చేయడంపైనా మీరు వ్యాఖ్యలు చేయా లని సోమవారం రాహుల్ ట్వీట్ చేశారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ ఈ ట్వీట్ చేయడం గమనార్హం. శనివారం నాగపూర్లో జరిగిన ఏబీవీపీ విద్యార్ధుల సదస్సులో గడ్కరీ మాట్లాడుతూ ముందు మీరు మీ ఇంటిని చక్కదిద్దుకోవాలని, ఇంటిని సవ్యంగా నిర్వహించుకోలేని వారు దేశానికి ఏమీ చేయలేరని హితవు పలికారు.