అమరావతి, ఫిబ్రవరి 4: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మోదీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. కోల్కతాలో జరిగిన పరిణామాలపై ఆయన స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల ముందు జరుగుతున్న దాడుల్ని ఆయన ఖండించారు. బీజేపీ తమ ప్రత్యర్ది పార్టీలపై అనవసరంగా కేసులు పెట్టి టార్గెట్ చేస్తుందన్నారు. కోడికత్తి కేసును ఎన్ఐఏకు అప్పగించడం కూడా బీజేపీ కుట్రలో భాగమేనని చెప్పారు. ఇప్పుడు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కక్ష సాధింపులకు దిగుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు తీసుకోకుండా, నోటిసులు ఇవ్వకుండా సిబీఐ అధికారులు చేసే దాడులపై పార్లమెంటులో నిలదీయలని టిడిపి ఎంపీలకు చంద్రబాబు సూచించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి చంద్రబాబు అండగా నిలుస్తామన్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని కేంద్రం తమపై కక్ష సాధిస్తుందన్నారు. రాష్ట్రాల హక్కులను హరించేందుకు ప్రధాని మోదీ కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మోదీ, అమిత్ షాలు వ్యవస్తను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు.