హైదరాబాద్, ఫిబ్రవరి 4: హై టెక్ సిటీ లో మెట్రో రైల్ సర్వీసులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15న హై టెక్ సిటీ లో మెట్రో రైలును ప్రారంభించనున్నట్లు సమాచారం. రెండు నెలలుగా అమీర్పేట నుంచి హైటెక్ సిటీకి ట్రయల్ రన్స్ నిర్వహించారు. అవి విజయవంతం కావడంతో సర్వీసులను ప్రారంభించేందుకు అనుమతి కోసం కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ ని సంభందిత అధికారులు సంప్రదించారు. హై టెక్ సిటీలో మెట్రో రైల్ డిసెంబర్, జనవరిలోనే ప్రారంభించవలసి ఉండగా, నిర్ణిత పరీక్షలు, భద్రత పరంగా ప్రైవేటు సంస్థల నుంచి సర్టిఫికేషన్లు రావల్సి ఉండడం వలన కొంత ఆలస్యమైందని మెట్రో అధికారులు తెలిపారు.
తుది పరీక్షగా కేంద్ర రైల్వే శాఖ నుంచి సీఎంఆర్ఎస్ ప్రతినిధుల బృందం అమీర్పేట నుంచి హైటెక్సిటీ మార్గంలో పరిశీలన చేస్తోంది. ఈ పరిశీలన పూర్తి కావడానికి ఇంకా వారం రోజుల సమయం పడుతుందని అంచనా. హైదరాబాద్ మెట్రో రైళ్ల నిర్వహణలో ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక టెక్నాలజీ అయిన కమ్యూనికేషన్ బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్ (సీబీటీసీ)ని వినియోగిస్తున్నారు. దీనికి సంభందించి రెండు సంస్థలు భద్రత పరంగా ఇప్పటికే సంతృప్తిని వ్యక్తం చేసాయి. సీఎంఆర్ఎస్ ప్రతినిధుల పరిశీలన పూర్తయిన తర్వాత ప్రభుత్వం ప్రారంభోత్సవం తేదీ, ముహూర్తాన్ని ప్రకటించనుంది. ఈ నెలా 15వ తేదీలోగా అనుమతులు లభిస్తాయని, అప్పుడే మెట్రో రైల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు.