న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 4: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పుణెలో విలేకరులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి, ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో పనిచేసే అవకాశం లభించినందుకు తనుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ రాజకీయాల నుంచి తప్పుకున్న మరుక్షణం తాను కూడా తప్పుకుంటానని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ప్రధాని కావాలన్న కోరిక తనకు లేదని తేల్చిచెప్పారు.
రాబోయే లోక్ సభ ఎన్నికలలో బీజేపీ ఖచ్చితంగా విజయం సాదిస్తుందని, ప్రధానిగా నరేంద్ర మోడీ మళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తారని స్మృతి జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుండి పోటి చేయాలనే విషయాన్ని బీజేపీ అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు తనను గుర్తించలేకపోయారని, కానీ ఇప్పుడు తనను గుర్తుపడుతున్నారని పేర్కొన్నారు. మంత్రి సుష్మాస్వరాజ్, స్పీకర్ సుమిత్రా మహాజన్లే తనకు రాజకీయాల్లో స్ఫూర్తి అని స్మృతి వివరించారు.