విజయవాడ, ఫిబ్రవరి 3: ఎన్నారై జయరాం హత్య వార్త తెలుసుకున్న తన భార్య పద్మ శ్రీ తనకు, తన పిల్లలకు రక్షణ కల్పించాలని ఏపీ పోలీసులను కోరారు. కాగా ఆదివారం నాడు మహాప్రస్థానంలో జయరామ్ అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలు ముగిసిన తర్వాత హైద్రాబాద్లో ఏపీ పోలీసులు పద్మశ్రీ నుండి వాంగ్మూలాన్ని సేకరించారు. జయరామ్ మృతి విషయం తెలుసుకొన్న పద్మశ్రీ ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికా నుండి హైద్రాబాద్ కు శనివారం నాడు చేరుకొంది. ఆదివారం నాడు పద్మశ్రీని ఎస్పై, ఇద్దరు పోలీసులు, న్యాయవాదుల సమక్షంలో వాంగ్మూలాన్ని సేకరించారు.
నా భర్తను, ఎవరు ఎందుకు హత్య చేశారో తేల్చాలని పద్మశ్రీ పోలీసులను కోరారు. జయరామ్ హత్య జరిగినందున తనకు, తన పిల్లలకు రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను కోరారు. జయరామ్తో ఎవరితోనైనా శత్రుత్వం ఉందా అనే విషయాలపై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో పోలీసులకు పద్మశ్రీ ఇచ్చే సమాచారం కూడ కీలకంగా మారే అవకాశం ఉంది.