అమరావతి, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ పై మండిపడ్డారు. అప నమ్మకానికి వైసీపీ ప్రతీక అయితే, నమ్మకానికి టీడీపీ ప్రతీక అని చెప్పారు. అమరావతిలో రూ. 50 వేల కోట్ల విలువైన పనులు పుర్తికబోతున్నాయని తెలిపారు. అధికారుల గౌరవాన్ని, ప్రతిష్టను పెంచేది టీడీపీ అయితే, అధికారులను జైలు పాలు చేసేది వైసీపీ అని విమర్శించారు. వారి హయాంలో ఫోక్స్ వ్యాగన్ కార్ల కంపెనీ వెళ్లిపోయిందని, తాము కియా కార్ల పరిశ్రమను ఏపీకి తిసుకోచ్చమని తెలిపారు.
పోగొట్టేది వైసీపీ అయితే, రాబట్టేది టీడీపీ అని చెప్పారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లేది జగన్ అయితే, ప్రతి రోజు ప్రజల్లో ఉండేది తానని అన్నారు. ఏ పార్టీ ఎలాంటిదో ప్రజలు గుర్తించాలని అన్నారు. టీడీపీని నమ్మితే నష్టం ఉండదనే భరోసాతోనే రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చారని చెప్పారు. టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.