న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 2: ఎట్టకేలకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కొత్త డైరెక్టర్ను నియమించింది. సీబీఐ చీఫ్ గా ఐపీఎస్ అధికారి రిషికుమార్ శుక్లా ఎంపికయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల పాటు సీబీఐ డైరెక్టర్ పదవిలో ఆయన కొనసాగనున్నారు. 1983 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన రిషికుమార్ శుక్లా గతంలో మధ్యప్రదేశ్ డీజీపీగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ రిషికుమార్ను సీబీఐ బాస్గా ప్రభుత్వం నియమించింది. మోదీ నేతృత్వంలో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున్ ఖర్గే సమావేశంలో పాల్గొన్నారు.
సీనియర్ ఐపీఎస్ అధికారులు జావెద్ అహ్మద్, రజనీకాంత్ మిశ్రా, ఎస్.ఎస్.దేశ్వాల్, శివానంద ఝా పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉండగా, వీరిపై ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదించిన రిషికుమార్ పేరును కూడా ఖర్గే వ్యతిరేకించారు. అయితే ప్రధాని, సీజేఐ ఆమోదంతో 2-1 మెజారిటీతో రిషికుమార్ను సీబీఐ నూతన డైరెక్టర్గా ఎంపిక చేసినట్టు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. గత నెల 24న ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో జరిగిన సెలక్షన్ కమిటీ మొదటి సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోకుండానే అసంపూర్ణంగా ముగిసింది. దీంతో రెండో సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.