అహ్మదాబాద్, ఆగస్టు 1 : ఇటీవల గుజరాత్ లో సంభవించిన భారీ వర్షాల కారణంగా అక్కడి చుట్టుపక్కల గ్రామాలన్నీ నీటమునగడంతో ఓ బాలింత తీవ్ర అస్వస్థతకు గురైంది. అసలు విషయంలోకి వెళితే.. గుజరాత్లోని బనస్కంత జిల్లా ప్రాంతంలో ఇటీవల శిశువుకు జన్మనిచ్చిన 22ఏళ్ల మహిళ పొట్టకు వేసిన కుట్ల కారణంగా, వాపు రావడంతో ఆమె పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే ఆమెకు చికిత్స అందించేందుకు బయలుదేరారు. అయితే బాధితురాలు ఉండే గ్రామానికి వెళ్లేమార్గం నీటమునగడంతో వాహనాలు వచ్చే వీలు లేదు. దాంతో వాళ్లు బనాస్ నదిపై బోటులో వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఎనిమిది కిలోమీటర్లు నడిచి బాధితురాలికి చికిత్స అందించినట్లు బనస్కంత జిల్లా అధికారి కల్యాణ్ సిన్హా జేటావత్ వెల్లడించారు.