అమరావతి, ఫిబ్రవరి 2: ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రవేశ పెట్టిన కొత్త పథకాల అమలులో భాగంగా నేటి నుంచి పసుపు కుంకుమ, పెన్షన్ లు అందజేయనున్నారు. గుంటూరులో ఈ నెల 2,3,4, తేదీలలో మూడు రోజుల పాటు పెన్షన్లు, డ్వాక్రా, మెప్మా మహిళలకు పసుపు కుంకుమ నగదు పంపిణీ చేయాలనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ.150 కోట్లు నగదు అందజేయనున్నారు. ఇందుకోసం బ్యాంకర్లతో చర్చించి ముందుగానే నగదు సిద్ధం చేయించారు.
లబ్ధిదారులకు రూ.3వేల చొప్పున పంపిణీ చేయడానికి రూ.2వేల నోటు వొకటి, రూ.500 నోట్లు రెండు ఇచ్చే విధంగా బ్యాంకర్లు నగదును సిద్ధం చేసి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు అందజేశారు. మూడు బృందాలు గ్రామ, మండల, మున్సిపల్, నగరపాలక సంస్థ పరిధిలో మూడు రోజుల పాటు పసుపు కుంకుమ, పెన్షన్ లను లబ్దిదారులకు అందజేస్తారు.