వాషింగ్టన్ ఫిబ్రవరి 2: అమెరికాలో నకిలీ విశ్వవిద్యాలయాల్లో అక్రమంగా చేరి నివసిస్తున్న విద్యార్థులను అండర్ కవర్ ఆపరేషన్-పేజ్ ఛేజ్ లో భాగంగా హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో 129 మంది భారతీయులేనని అధికారులు తాజాగా వెల్లడించారు. మరోవైపు అరెస్టయిన విద్యార్థులకు సాయం చేసేందుకు అమెరికాలోని భారత ఎంబసీ 24 గంటల పాటు పనిచేసే హాట్లైన్ను తెరిచింది. విద్యార్థులు, వాటి కుటుంబసభ్యులకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు ఓ నోడల్ అధికారిని కూడా నియమించింది. టెక్సాస్లోని డిటెన్షన్ సెంటర్లో ఉన్న భారత విద్యార్థులను అక్కడి భారత కాన్సులేట్ అధికారులు కలిశారు. విద్యార్థులకు అన్ని విధాల సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
అమెరికాలో అక్రమ వలసదారుల గుట్టు రట్టు చేయడానికి హోం ల్యాండ్ అధికారులు వొక సీక్రెట్ అండర్ కవర్ ఆపరేషన్ ను చేపట్టారు. ఇందులో భాగంగా వొక నకిలీ యూనివర్శిటీని ఏర్పాటు చేసి 900మందిని విద్యార్థులుగా చేర్చుకున్నారు. వీరందరూ అక్రమంగా యూనివర్సిటీలో చేరి విద్యార్థి వీసాలను పొందారు. వీరందరూ అమెరికాలో అక్రమంగా నివసిస్తునట్లు తేలడం తో ఇమ్మిగ్రేషన్ అధికారులు వీరిని అరెస్ట్ చేసారు. వీరిలో చాలామంది భారత్ కి చెందిన వారే ఉన్నారు. వీరందరినీ యూనివర్సిటీ లో చేర్చడానికి సహకరించిన 8 మంది దళారులను కుడా అరెస్ట్ చేసారు.