న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 1: లోక్ సభ ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశ పెట్టి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా కేంద్రం నూతన పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ అనే పథకం కింద అసంఘటిత రంగంలోని కార్మికులకు 60 ఏళ్లు దాటాక ప్రతి నెలా పెన్షన్ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దీనికోసం కార్మికులు ప్రతి నెలా కనీస మొత్తం కడితే సరిపోతుందన్నారు. నెలకు రూ.15,000 అంతకంటే తక్కువ వేతనం పొందే కార్మికులు ఈ పథకానికి అర్హులని పియూష్ గోయల్ తెలిపారు.
వీరంతా 60 సంవత్సరాల వయసుకు చేరుకున్నాక వారికీ ప్రతి నెలా రూ.3,000 పెన్షన్ అందుకుంటారని తెలిపారు. వొకవేళ 29 ఏళ్ల వ్యక్తి ఈ పథకంలో చేరితే నెలకు రూ.100 చెల్లించాలన్నారు. ఈ పథకం 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి వస్తుందని, ఈ పథకం కోసం ఇప్పటికే రూ.500 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ నూతన పెన్షన్ పథకంతో దాదాపు 10 కోట్ల మంది కార్మికులు, సిబ్బంది లబ్ధి పొందుతారని చెప్పారు.