ఆంధ్ర ప్రదేశ్ కేబినేట్ సమవేశం లో కీలక నిర్ణయాలు

SMTV Desk 2019-02-01 16:37:11  Andhra Pradesh Cabinet meeting, Chandra Babu, Andhra Pradesh

అమరావతి, ఫిబ్రవరి 1: గురువారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షుడిగా ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో పలు అంశాలపై చర్చించి అలాగే ఎన్నికలు సమీపిస్తున్నందున పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టడానికి సర్కార్ నిర్ణయం తీసుకుంది. అంతేకాక అగ్రవర్ణాలకు అమల్లోకి వచ్చిన 10 శాతం రిజర్వేషన్ల నుంచే వీటిని కేటాయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. హైకోర్టులో 250 కోట్ల రూపాయలు డిపాజిట్‌ చేసి అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లించాలని, ఆస్తుల వేలం తర్వాత ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. సెలూన్లకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సమైక్యాంధ్ర ఉద్యమం నాటి మిగిలిన కేసులు ఎత్తివేయాలని నిర్ణయం. పసుపు -కుంకుమ పథకం నిధుల పంపిణీకి, చుక్కల భూముల సమస్యల పరిష్కారంపై ముసాయిదా బిల్లుకు, భూధార్‌ ప్రాజెక్టుకు చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

'భూధార్' ప్రాజెక్టులు చట్టబద్ధం చేయాలనీ ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. బేడ, బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలన్న శర్మ కమిషన్ నివేదిక తో పాటు రాజధాని ఆర్దిక ప్రణాళికను కూడా ఆమోదించారు. వంశధార నిర్వాసితులపై పెట్టిన కేసుల ఎత్తివేతకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జయహో బీసీ సదస్సులో ఇచ్చిన హామీలపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. హామీలకు సంబంధించి వెంటనే జీవోలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. వివిధ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా చేయడంపైనా చర్చించారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ఇటీవల హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 8న మరోసారి మంత్రివర్గ భేటీ నిర్వహించనున్నారు. ఎన్నికల సమయం సమీపిస్తున్నందున ఆ రోజు మరిన్ని కిఇలక నిర్ణయాలు, ప్రత్యేక పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయితే కొత్త పథకాలు ప్రవేశ పెట్టడానికి వీలుండదు.