ప్రధాన మంత్రి పదవి పోటీలో 9 మంది అభ్యర్థులు

SMTV Desk 2019-02-01 14:55:32  G. Kishan Reddy, KCR, Chandra Babu, BJP, KTR, Lokesh

హైదరాబాద్, ఫిబ్రవరి 1: బీజేఎల్పీ మాజీ నేత జి.కిషన్‌రెడ్డి గురువారం నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ పదాధికారుల సమావేశానికి హాజరైన అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దేశాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ రైతుల సంక్షేమాన్ని విస్మరించి, లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడిందని ఆరోపించారు. మళ్లీ అధికారంకోసం తాపత్రయ పడుతున్న కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన కూటమిలో 9 మంది ప్రధాని అభ్యర్థులున్నారని, వచ్చే ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీల మహాకూటమి అధికారంలోకి వస్తే రోజుకొక ప్రధాన మంత్రిని చూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. కూటమిలో మమత, మాయావతి, చంద్రబాబు , అఖిలేష్‌లాంటి వారు 9 మంది ప్రధానమంత్రి పదవి కోసం పాకులాడుతున్నారని అన్నారు.

బీజేపి ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా అవినీతి రహిత పాలన అందిస్తూ దేశ ప్రజల సంక్షేమానికి, దేశాభివృద్ధికి కృషి చేసిందని అన్నారు. కేసీఆర్, చంద్రబాబులు కేంద్రం వైపు ద్రుష్టి పెట్టగా వారి వారసులు కేటీఆర్, లోకేశ్‌ ముఖ్యమంత్రులు కావాలని చూస్తున్నట్టు వ్యాఖ్యానించారు. తెలంగాణా లోని అన్ని పార్లమెంట్‌ స్థానాలకు బీజేపీ పోటీ చేస్తుందని, ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి 50 రోజులైనా కేసీఆర్ కేబినెట్‌ను ఏర్పాటు చేయకపోవడం రాజ్యాంగానికే విరుద్ధమన్నారు. దేశంలో మంత్రివర్గం లేని ప్రభుత్వం వొక్క కేసీఆర్‌ది మాత్రమేనని అన్నారు.